Sunday, February 19, 2017

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) 2,313 ప్రొబేషనరీ ఆఫీసర్ (పీవో) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్


ప్రభుత్వ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) 2,313 ప్రొబేషనరీ ఆఫీసర్ (పీవో) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. బ్యాంకింగ్ రంగంలో అత్యున్నత స్థాయి హోదా సైతం పొందేందుకు వీలు కల్పించే పోస్టు ఇది.
విద్యార్హతలు: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. చివరి సంవత్సరం విద్యార్థులు కూడా అర్హులే. ఒకవేళ వారు ఇంటర్వ్యూకు అర్హత సాధిస్తే 2017, జూలై 1 నాటికి ఉత్తీర్ణులైనట్లు ధ్రువీకరణ పత్రం చూపించాలి.
వయసు: 2017, ఏప్రిల్ 1 నాటికి 21 - 30 ఏళ్ల మధ్య ఉండాలి. గరిష్ట వయోపరిమితిలో ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్ల సడలింపు ఉంటుంది. రిజర్వేషన్ల ఆధారంగా వివిధ వర్గాల వారికి వయోసడలింపు ఉంటుంది.
ఖాళీల వివరాలు: జనరల్- 1010, ఓబీసీ- 606, ఎస్టీ- 350, ఎస్సీ 347.
ఎంపిక విధానం: పీవో ఎంపిక ప్రక్రియ మూడు దశల్లో ఉంటుంది.
తొలిదశ: ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ (100 మార్కులు). ఖాళీల సంఖ్యకు 20 రెట్ల మందిని తర్వాత దశ మెయిన్‌కు ఎంపిక చేస్తారు.
రెండో దశ: 200 మార్కులకు ఆబ్జెక్టివ్ పద్ధతిలో మెయిన్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఇదే దశలో డిస్క్రిప్టివ్ టెస్ట్ (లెటర్ రైటింగ్, జనరల్ ఎస్సే) 30 నిమిషాల్లో 50 మార్కులకు నిర్వహిస్తారు.
మూడో దశ: గ్రూప్ ఎక్సర్‌సెజైస్ (జీఈ - 20 మార్కులు), ఇంటర్వ్యూ (30 మార్కులు) - 50 మార్కులకు ఉంటుంది.
పరీక్ష విధానం
రెండో దశలోని డిస్క్రిప్టివ్ టెస్ట్ మినహా ప్రిలిమినరీ, మెయిన్ పరీక్షలు పూర్తిగా ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటాయి.
ప్రిలిమినరీ పరీక్ష (గంట) :

విభాగం
ప్రశ్నలు
మార్కులు
ఇంగ్లిష్ లాంగ్వేజ్
30
30
క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్
35
35
రీజనింగ్ ఎబిలిటీ
35
35
మొత్తం
100
100

మెయిన్ పరీక్ష..

సెక్షన్
ప్రశ్నలు
మార్కులు
సమయం (నిమిషాలు)
రీజనింగ్ అండ్ కంప్యూటర్ ఆప్టిట్యూడ్
45
60
60
డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్‌ప్రిటేషన్
35
60
45
జనరల్/ ఎకానమీ/బ్యాంకింగ్ అవేర్‌నెస్
40
40
35
ఇంగ్లిష్ లాంగ్వేజ్
35
40
40
మొత్తం
155
200
3 గంటలు

తుది ఎంపిక ఇలా: ప్రిలిమినరీలో వచ్చిన మార్కులను ఫైనల్ సెలక్షన్‌కు పరిగణనలోకి తీసుకోరు. మెయిన్ పరీక్ష, డిస్క్రిప్టివ్ టెస్ట్‌లో సాధించిన మార్కులు, గ్రూప్ ఎక్సర్‌సెజైస్, ఇంటర్వ్యూలో పొందిన మార్కుల ఆధారంగా అభ్యర్థుల తుది ఎంపిక ఉంటుంది. మెయిన్ పరీక్ష, డిస్క్రిప్టివ్ టెస్ట్ రెండింటిలో 250 మార్కులకు వచ్చిన స్కోరును 75కు; గ్రూప్ ఎక్సర్‌సెజైస్, ఇంటర్వ్యూల్లో 50 మార్కులకు వచ్చిన స్కోరును 25 మార్కులకు క్రోడీకరించి ఫైనల్ కటాఫ్ స్కోరు నిర్దేశిస్తారు. మొత్తంగా 100 మార్కులకు సాధించిన స్కోరు ఆధారంగా తుది ఎంపిక జరుగుతుంది. పరీక్షలో నెగిటివ్ మార్కులున్నాయి. ఒక్కో తప్పు సమాధానానికి ఆయా ప్రశ్నలకు కేటాయించిన మార్కుల్లో నాలుగో వంతు కోత విధిస్తారు.

ప్రతి దశలో, సెక్షన్‌లో కటాఫ్ మార్కులు :
పీవో పరీక్షలో ప్రతి దశలో, ప్రతి సెక్షన్‌లో నిర్దేశిత కటాఫ్ మార్కులు పొందడం తప్పనిసరి. ప్రిలిమ్స్‌లో కనీస అర్హత మార్కులను పేర్కొన్నప్పటికీ వాటిని తుది జాబితా రూపకల్పనలో పరిగణనలోకి తీసుకోరు. కానీ ఆయా సెక్షన్ కటాఫ్, ఫైనల్‌గా నిర్ణయించే అర్హత మార్కులు సాధిస్తేనే తర్వాతి దశలకు ఎంపికవుతారు. రెండో దశలో మెయిన్ ఎగ్జామినేషన్ (ఆబ్జెక్టివ్, డిస్క్రిప్టివ్), మూడో దశలోని జీఈ/ఇంటర్వ్యూల్లో వేర్వురుగా కనీస అర్హత మార్కులు సాధిస్తేనే తుది ఎంపికకు అభ్యర్థులను పరిగణనలోకి తీసుకుంటారు. ప్రిలిమ్స్, మెయిన్ ఆబ్జెక్టివ్ పరీక్షలకు నెగిటివ్ మార్కులు ఉంటాయి.

వేతన వివరాలు: ఎస్‌బీఐ పీవోగా జూనియర్ మేనేజ్‌మెంట్ గ్రేడ్ స్కేల్-1 హోదాలో ప్రవేశించిన అభ్యర్థుల మూల వేతనం నెలకు రూ.27,620గా ఉంటుంది. వీటితోపాటు డీఏ, హెచ్‌ఆర్‌ఏ, సీసీఏ, మెడికల్ అలవెన్స్ తదితర అలవెన్సులతో అన్నీ కలిపి పనిచేసే ప్రాంతం ఆధారంగా సంవత్సరానికి కనిష్టంగా రూ.7.93 లక్షలు, గరిష్టంగా రూ. 12.95 లక్షలు లభిస్తుంది.

ప్రయత్నాల సంఖ్య పరిమితం :
సివిల్ సర్వీసెస్ పరీక్షల మాదిరిగానే ఎస్‌బీఐ పీవో పరీక్షలోనూ ప్రయత్నాల సంఖ్యను నిర్దేశించారు. జనరల్ అభ్యర్థులు గరిష్టంగా నాలుగుసార్లు, ఓబీసీలు ఏడుసార్లు, ఓబీసీ దివ్యాంగులు ఏడుసార్లు మాత్రమే ఈ పరీక్ష రాయాలి. 2010 ఏప్రిల్ 18న నిర్వహించిన ఎస్‌బీఐ పీవో పరీక్ష నుంచి ప్రయత్నాల సంఖ్యను లెక్కిస్తారు. కేవలం ప్రిలిమినరీ పరీక్షకు హాజరైతే దాన్ని ప్రయత్నంగా పరిగణించరు.

కెరీర్ గ్రాఫ్ :
ప్రారంభంలో పీవోగా ఎంపికై న వారికి రెండేళ్ల శిక్షణ తర్వాత జూనియర్ మేనేజ్‌మెంట్ గ్రేడ్-1 హోదా లభిస్తుంది. రెండేళ్ల శిక్షణ తర్వాత నిర్వహించే పరీక్షలో అత్యుత్తమ ప్రతిభ చూపితే నేరుగా మిడిల్ మేనేజ్‌మెంట్ గ్రేడ్ -2 కేడర్ సొంతం చేసుకోవచ్చు.

ముఖ్య తేదీలు
దరఖాస్తు విధానం:
ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు రుసుం: ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ అభ్యర్థులకు రూ.100; ఇతరులకు రూ.600
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్: 2017, మార్చి 6 వరకు.
ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ (ఆన్‌లైన్) తేదీలు: ఏప్రిల్ 29, 30; మే 6, 7
ప్రిలిమ్స్ ఫలితాలు: మే 17, 2017.
మెయిన్ ఎగ్జామినేషన్ (ఆన్‌లైన్): జూన్ 4, 2017.
మెయిన్ ఫలితాలు: జూన్ 19, 2017.
జీఈ/ఇంటర్వ్యూ నిర్వహణ తేదీ: 2017, జూలై 10 నుంచి
తుది ఫలితాల వెల్లడి: ఆగస్టు 5, 2017.

పరీక్ష కేంద్రాలు :
ప్రిలిమినరీ :
ఆంధ్రప్రదేశ్:
చీరాల, చిత్తూరు, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, పుత్తూరు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం.
తెలంగాణ: హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్.
మెయిన్స్ :
ఆంధ్రప్రదేశ్:
గుంటూరు,కర్నూలు, విజయవాడ, విశాఖపట్నం.
తెలంగాణ: హైదరాబాద్.
పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు

వెబ్‌సైట్: www.sbi.co.in/careers